అమరావతి, ఫిబ్రవరి 05: ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నా ఆలోచన అనే యు ట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యతు చంద్రబాబునాయుడు, జగన్, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురు వ్యక్తుల మీద ఆధారపడి ఉందని అభిప్రాయ పడ్డారు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని, వీరిపైనే రాష్ట్ర రాజకీయాలు, ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కి హరిగిన అన్యాయం పై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి జనసేన, వైసీపీలు హాజరు కాలేదని ఆయన గుర్తు చేసారు. టిడిపి, వైసిపి, జనసేన అధినేతలు ముగ్గురూ ఒకే వేదికపై కూర్చొని మాట్లాడితే అప్పుడు అందరి అభిప్రాయాలూ తెలుస్తాయని ఆయన తెలిపారు. అంతేకానీ టీడీపీ వాళ్లుంటే తాను రానని జగన్మోహన్ రెడ్డి అనడం ఎంత వరకు కరెక్టో తనకు అర్థం కాలేదని అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేయకుండా అందరూ, ఒకే వేదికపైకి వచ్చి వారి వారి అభిప్రాయాలు చెప్పాలని తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.