ముంభై, ఫిబ్రవరి 05: మణికర్ణిక సినిమాలో ఝాన్సి లక్ష్మీ భాయి పాత్రలో నటించి అలాగే ఆ సినిమాకు దర్శకత్వం వహించి విమర్శల ప్రశంశలు అందుకుంది కంగనా రనౌత్. అంతేకాక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ సినిమా వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కంగనా మాట్లాడుతూ... పలు నటులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 2014లో కంగనా నటించిన క్వీన్ సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ క్రెడిట్ మొత్తం తీసేసుకుందని, తన గురించి మాత్రం ఎవరూ మాట్లాడేవారు కాదని చెప్పింది. ఎక్కడకి వెళ్లినా ఆ సంస్థ తెరకెక్కించిన సినిమాల స్క్రీనింగ్స్ ప్రదర్శించేవారని తన సినిమాల స్క్రీనింగ్స్ ని ఎవరూ ప్రదర్శించేవారు కాదని అన్నారు.
వారికేదైనా అవసరం వస్తే మాత్రం సిగ్గు లేకుండా ఫోన్లు చేస్తుంటారని, వారి కోసం నేను సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. రాజి సినిమా విడుదల సమయంలో అలియా భట్, డైరెక్టర్ మేఘనాలతో అరగంట మాట్లాడానని చెప్పింది. అలియా తనకు ట్రైలర్ లింక్ పంపించి ప్లీజ్ చూడు అని రిక్వెస్ట్ చేస్తే తను చూసి అభినందించినట్లు చెప్పిన కంగనా తన సినిమాకు రమ్మని పిలిచినప్పుడు మాత్రం ఎవరూ స్పందిచలేదని చెప్పింది. అమీర్ ఖాన్ దంగల్ సినిమా గురించి మాట్లాడడానికి అంబానీ ఇంటికి వెళ్లారని తెలిసి తను కూడా వెళ్లినట్లు గుర్తు చేసుకున్న కంగనా.. తన సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ కి మాత్రం ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.