అమరావతి, ఆగస్టు 1 : ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ మురికి నీటి వ్యవస్థను ఈ సంవత్సరం చివరి నాటికీ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సచివాలయంలో పంచాయతీ రాజ్, నరేగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, గ్రామాల్లో సుమారు రూ.2600కోట్ల వ్యయంతో 10వేల కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ చేయాలని నిర్ణయించారు. నరేగా అనుసంధానంతో నాణ్యమైన మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ఈ నెల 4లోగా పరిపాలన అనుమతులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎనిమిది లోగా సామాగ్రి పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు. అలాగే 15 లోగా శంకుస్థాపన చేసి, సెప్టెంబర్ 1 నుంచి పనులు ప్రారంభం కావాలని వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ 31 లోపు మురికి నీటి పనులన్నీ పూర్తి కావాలని అన్నారు.