హైదరాబాద్, ఫిబ్రవరి 4: అమెరికాలోని ఫిర్మింగ్టన్ లో ఫేక్ యూనివర్సిటీలో విద్యార్థులుగా నకిలీ వీసాతో అమెరికాలో స్థిరపడేందుకు యత్నిస్తున్నారన్న అభియోగంతో అరెస్టయిన వారిలో ౩౦ మంది తెలుగు విద్యార్థులను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం ఉదయం విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్ జలగం మీడియాకు తెలిపారు. కాగా ఈ కేసులో మొత్తం 130 మంది విద్యార్థులను అరెస్ట్ చేయగా వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు.
తెలుగు విద్యార్థులు అనవసరంగా నకిలీ వీసాల కేసులో ఇరుక్కున్నారని, వారిని అమెరికా జైలు నుంచి విడుదల చేయడానికి అమెరికాలోని తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ పిల్లల వివరాలను తన పేస్ బుక్ ఖాతాకు పంపమని ఆయన కోరారు. త్వరలోనే మిగతా విద్యార్థులను కూడా క్షేమంగా భారత్ కు తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఈ విషయమై ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు.