న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత తేజస్వీయాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ ని వ్యంగ్యపరిచారు. కాంగ్రెస్ పార్టీ పాట్నాలో నిర్వహించిన ర్యాలీకి తేజస్వీయాదవ్ హాజరయ్యారు. ఈ ర్యాలిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకే మహాకూటమిగా ఏర్పడి పోరాడుతున్నామని అన్నారు. ఈక్రమంలో ఆయన మోడీని విమర్శించారు.
గత 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత మోదీదని, జుట్టు లేని తమకెందుకు దువ్వెనలు అమ్ముతున్నారని వారు ప్రశ్నిస్తే, తాము అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్మిన మోదీ మంచి సేల్స్ మెన్ అని సెటైర్లు విసిరారు. దేశంలో అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు అని, మోదీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. మోదీ అసలు రంగు గురించి బీహార్ నిరుద్యోగులకు తెలియజెప్పేందుకే రాహుల్ ఈ ర్యాలీలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు.