దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ: రాహుల్ గాంధీ

SMTV Desk 2019-02-04 11:03:04  Rahul Gandhi, Tejaswee Yadav, Sharad Yadav

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోరు పెంచారు. బీహార్ రాజధాని అయిన పాట్నాలో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఇటీవల దేశంలోని పేదలందరికీ కనీస వేతన పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన రాహుల్, ఇప్పుడు దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈమధ్య కాలంలో జరిగిన ఎన్నికలలో విజయం సాదించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో రైతు రుణమాఫీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తామని చెప్పారు.

రైతులు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, రైతులను అవమానించిన మోదీ ప్రభుత్వానికి వారే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీని రైతు సమస్యకు పరిష్కారంగా కేంద్రం భావించడం లేదన్నారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను చూసిన తర్వాత మాత్రమే కేంద్రం నగదు బదిలీని ప్రకటించిందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇప్పుడు రూ.6 వేలు ఇస్తామని అంటున్నారని రాహుల్ విమర్శించారు. కాగా, ఈ ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.