హైదరాబాద్, ఆగష్టు 1: హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో అశోక్, ఈషా జంటగా నటించిన సినిమా దర్శకుడు. ఈ చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై విజయ్కుమార్, థామస్ రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తితో కలిసి సుకుమార్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ‘దర్శకుడు’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమా హీరో అశోక్ మీడియాతో మాట్లాడుతూ....‘‘హీరో అవుతానని ఏమాత్రం ఊహించలేదు. ‘1 నేనొక్కడినే’ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను. దర్శకుడు సినిమా డైరెక్టర్ హరిప్రసాద్, సుకుమార్ స్నేహితులు. ‘దర్శకుడు’ను అశోక్తో చేస్తానని హరిప్రసాద్ చెప్పినప్పుడు సుకుమార్ షాకయ్యారు. ఎందుకంటే నాకు బాగా సిగ్గెక్కువ. అలాంటి నేను కెమెరా ముందు నటించగలనా? అనేది ఆయన సందేహం. ఆ విషయం తాను చూసుకుంటానని హరిప్రసాద్ అనడంతో, సుకుమార్ సరేనన్నారు. అలా వాళ్లిద్దరూ నన్ను హీరోను చేశారు. దర్శకుడు ఏం చెబితే దాన్ని చేయడానికి ప్రయత్నించాను. ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు నేను బాగానే చేశాననిపించింది. సుకుమార్ సినిమా చూసి, ఫోన్ చేసి, ‘బాగా చేశావ్రా నీ వాయిస్ బాగుంది’ అని మెచ్చుకోవడంతో చాల సంతోషపడ్డాను అని చెప్పారు అశోక్. ఈ సినిమాతో చాలానే నేర్చుకున్నానని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి యాక్టర్ని అయ్యాను. మునుముందు నటుడిగానే కొనసాగుతానో, లేదా దర్శకత్వం వైపు అడుగులేస్తానో ఖచ్చితంగా చెప్పలేను కానీ ఏదో ఒకరోజు డైరెక్టర్ ని అవుతాను.” అని చెప్పుకొచ్చారు అశోక్.