విజయనగరం, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ పార్టీ నుండి మరో కీలక నేత బయటకు వచ్చారు. రానున్న ఎన్నికల సందర్భంగా పార్టీలో వలుసలు ఎక్కువగా అవుతున్నాయి. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే అనంతరం తెదేపా కండువా కప్పుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై కిషోర్ చంద్రదేవ్ ఈ విషయమై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. విజయనగరం జిల్లాకు చెందిన కిషోర్ చంద్రదేవ్కు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నేత ఆశోక్గజపతిరాజు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కిషోర్ చంద్రదేవ్ 1977 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రెస్ (ఎస్)లో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి చట్టసభల్లో కొనసాగారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన పలు పదవులను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఆయనకు మంచి పట్టుంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజులు మంత్రులుగా ఉన్నారు. శత్రుచర్ల విజయరామరాజు రాష్ట్రమంత్రిగా, కిషోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. వీరిద్దరికి కూడ పార్వతీపురం డివిజన్లో పట్టుంది. 2014 ఎన్నికలకు ముందు శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పాతపట్నం నుండి ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో కిషోర్ చంద్రదేవ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను పనిచేయనున్నట్టు ఆయన చెప్పారు. కిషోర్ చంద్రదేవ్ ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.