రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ బాబు సోదరుడే...

SMTV Desk 2019-02-03 15:50:12  Chandrababu, Balakrishna, Vasundhara devi, TDP, Pasupu kunkuma scheme

హిందూపురం, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ చేస్తున సంగతి తెలిసిందే. అయితే రెండో విడత పసుపు, కుంకుమ పథకం ద్వారా చెక్కుల పంపిణి కార్యక్రమంలో బాలకృష్ణ తన భార్య వసుంధరదేవితో కలిసి హిందూపురంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే అంతకుముందు ఎంజీఎం క్రీడా మైదానంలో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడారు. మహిళా సాధికారిత లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగినా ముందుచూపు అనుభవంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా అమలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగానే హిందూపురానికి తాగునీటిని తీసుకొస్తున్నారని చెప్పారు. త్వరలోనే నీటి సమస్య పరిష్కారం కానుందని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఒక్కరికే కాదు రాష్ట్రంలోని మహిళలకు సోదరుడే అని ఆమె చెప్పారు. మహిళలపై అభిమానంతో చంద్రబాబునాయుడు ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారని ఆమె చెప్పారు.