న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లేహ్ లో ఆయన మాట్లాడుతూ, తన చేతుల మీదుగా ఈరోజు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని, వాటి ప్రారంభోత్సవాలను కూడా తానే చేస్తానని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, తను మరోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించాబోతున్నానని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో జమ్ముకాశ్మీర్ పూర్తిగా నిరాదరణకు గురైందని, బీజేపీ పాలనలోనే అభివృద్ధి చెందినదని తెలిపారు.
ఈ ఐదేళ్ల పాలనలో విభజన రాజకీయాలను, లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని పారదోలామని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని జాప్యం చేయకుండా తొందరగా అందజేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తొలి విడత సహాయంగా ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ. 2 వేలు అందిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నంబర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేశామని చెప్పారు.