కిర్లంపూడి, ఆగష్టు 1: కాపుల రిజర్వేషన్స్ కోసం మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రపడ పద్మనాభం పోరాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల ఆయన తలపెట్టిన పాదయాత్రను శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ముద్రగడను కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సెక్షన్ 144(3) ప్రకారం ఆగష్టు 2వ తేదీ వరకు గృహ నిర్భందం చేశారు. ఎట్టి పరిస్థితులలో తన పోరాటాన్ని ఆపేది లేదని, ఆగష్టు 3వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తానని ఆయన స్పష్టం చేసారు. జూలై 31న ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో ముద్రగడ పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. ఈ లేఖలో కాపులను బీసీలలో చేరుస్తామనే హామిని చంద్రబాబు నిలబెట్టుకోలేదని, సీఎం మాటలు నమ్మి మీ పరపతిని తగ్గించుకోవద్దు అని ఆయన స్పష్టం చేసారు. ప్రాంతాల కోసం, కులాల కోసం రాజకీయాలు చేయవద్దన్న పవన్ దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.