న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ నేతలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే నేను నా పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు. అయితే దీనిపై రాహుల్ గాంధీ అసలు ఎం జరిగిందని ఆరా తీసి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొన్ని సూచనలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా చూసుకునే బాధ్యత మీదేనని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఆపరేషన్ కమలకు అవకాశం ఇస్తే మొదటికి మోసం వస్తుందని, ఎంఎల్ఏలు జారిపోకుండా చూసుకునే బాధ్యత మీదే అని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాజీ సిఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి చెప్పిన విషయం తెలిసిందే. మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటూ కాంగ్రెస్ ఎంఎల్ఏలు చెప్పడం, కాంగ్రెస్ నాయకుల మీద జెడిఎస్ నాయకులు విరుచుకుపడటంతో సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తానని బహిరంగంగానే ఎందుకు చెప్పారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం అన్నారు అంటూ సిద్ధరామయ్య నుంచి రాహుల్ గాంధీ సమాచారం తెలుసుకున్నారు.
సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, కెసి.వేణుగోపాల్ చర్చించారు. తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని జెడిఎస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని, వెంటనే సీట్ల పంపిణీ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య, కెసి.వేణుగోపాల్ మనవి చేశారు. సంకీర్ణ ప్రభుత్వంతో జెడిఎస్ నాయకులకు ఎక్కువ ప్రాధానయత ఇస్తున్నారని, మమ్మల్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంఎల్ఏలు అసంతృప్తితో ఉన్నారని మాజీ సిఎం సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి చెప్పారు. జెడిఎస్కు ఎక్కువ లోక్సభ స్థానాలు కేటాయిస్తే తాము సహకరించమని కాంగ్రెస్ ఎంఎల్ఏలు అంటున్నారని తెలిసింది.