అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. మోదీ చేపట్టిన కొత్త ప్రపోజల్ పేరే ఫెడరల్ ఫ్రంట్ అని దీనికి వెదికగా కేసీఆర్, జగన్ కలిసి ఇక్కడ రాజకీయం చేయబోతున్నారని విమర్శించారు. కేంద్రంతో పాటు వైసీపీ, టీఆర్ఎస్ నేతలపై కూడా చంద్రబాబు విరుచుకుపడ్డారు. తాను యూటర్న్ తీసుకున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయనీ, తనది ఎన్నటికీ రైట్ టర్నేనని వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ చేస్తున్నది ధర్మపోరాటమనీ, అందులో అంతిమ విజయం తమదేనని స్పష్టం చేశారు.
జగన్ పై నమోదయిన కేసులను బీజేపీ కొట్టివేయనున్నాదని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మాత్రమే కాకుండా ఆర్థిక నేరగాళ్లందరినీ కాపాడేందుకు ఎన్డియే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహించారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇప్పుడు నోటీసులు పంపించి వేధిస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసులో ఎన్ఐఏకు జోక్యం చేసుకునే అధికారం లేదని చంద్రబాబు అన్నారు.