హైదరాబాద్, ఫిబ్రవరి 1: శివ సినిమాతో ఆక్షన్ హీరోగా కొనసాగిన అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా నాగ్ కెరియర్ లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు కథ, మాటలు అందించాడు. 2002లో వచ్చిన ఈ సినిమాకు ఇన్నేళ్లకు సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో మన్మథుడు సీక్వల్ చేస్తున్నాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో ఈ సినిమా మార్చి నుంచి పట్టాలెక్కనుంది.
60 రోజుల పాటు పోర్చుగల్లో నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే… `మన్మథుడు` తరహాలోనే ఈ సీక్వెల్లోనూ ఇద్దరు నాయికలకు స్థానముందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… మెయిన్ హీరోయిన్గా నటించే ఛాన్స్ పాయల్ రాజ్పుత్కు దక్కిందని తెలిసింది. త్వరలోనే పాయల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మొదటి సినిమాలోనే నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించి మెప్పించిన ఈ ఉత్తరాది సోయగం… ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కో రాజా`లో నటిస్తోంది.