అమరావతి, ఫిబ్రవరి 1: ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పసుపు రంగు చొక్కాలో కనిపించే ఆయన ఈరోజు నల్ల చొక్కా, తెలుపు ప్యాంటు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. ఆంద్ర ప్రదేశ్ కు కేంద్రం చేస్తోన్న అన్యాయంపై చంద్రబాబు వినూత్న నిరసనకు దిగారు. రాష్ట్రం విభజన తరువాత హామీల అమలులో, ప్రత్యేకహోదా విషయమై రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా నలుపు దుస్తులు ధరించి రావాలని ఇటీవల ఎమ్మెల్యేలను చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూడా స్వయంగా నలుపు రంగు దుస్తులు ధరించి అసెంబ్లీకి పయనమయ్యారు. కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఈరోజు నిరసన దినంగా పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి 14 వరకూ ఢిల్లీలో ధర్మపోరాటం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు పలు విపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాల తరువాత టీడీపీ నేతలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి వినతిపత్రం అందించనున్నారు.