ముంబై, ఆగస్టు1 : దేశంలో ఎక్కడ కనివిని ఎరుగని.. వైద్య చరిత్రలో ఓ అత్యంత విచిత్ర కేసు చోటుచేసుకుంది. ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇటువంటి విచిత్ర కేసులు ఇప్పటివరకూ ఓ 200 మాత్రమే వెలుగులోకి రావడం జరిగింది. ఇటీవల ముంబై బిర్లా ఆసుపత్రిలో ముంబ్రా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి పురుడు పోసుకోగా, పూర్తి ఆరోగ్యంతో పండంటి బాబు జన్మించాడు. కాగా రొటీన్ గా అతన్ని స్కాన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయే విషయాన్ని వెలికి తీశారు. ఆ బాబు కడుపులో మరో బాబు ఉండటమే ఇందుకు కారణం. 7 సెంటీమీటర్ల పొడవుతో, తల, కాళ్లు, చేతులు అభివృద్ధి చెందిన స్థితిలో మరో చిన్నారి పిండాన్ని కనుగొన్నారు. బిడ్డ పుట్టిన తొమ్మిదో రోజున ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యులు, విజయవంతంగా శస్త్రచికిత్సను చేసి ఆ చిన్నారి గర్భవతుడి కడుపు నుంచి 150 గ్రాముల బరువున్న పిండాన్ని వెలికితీశామని వైద్యులు వెల్లడించారు.