అమరావతి, జనవరి ౩౦: లోక్ సభ ఎన్నికల ప్రచారం కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ఆంధ్రప్రదేశ్ పర్యటనలు ఖరారయ్యాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటనల వివరాలను తెలిపారు. ఫిబ్రవరి 4న విజయనగరంలో బస్సు యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారని, ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖలో ప్రధాని పర్యటించనున్నారని కన్నా చెప్పారు. 21న రాజమండ్రిలో క్లస్టర్ మీటింగ్, 25న పార్లమెంట్ నియోజకవర్గ శక్తి కేంద్రాలతో సమావేశం, 26న వొంగోలులో జరిగే కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. ఇదే సమయంలో కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. ఇంతకుముందు కియా మోటార్స్ చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయేదని తరువాత మోదీ వల్లనే కియా వచ్చిందని చెప్పారు. కేంద్ర పథకాలను చంద్రబాబు తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్ఐఏ, ఈడీలతో పాటు తనకు కూడా చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు