అమెరికా, జనవరి ౩౦: భారత్, ఆఫ్గనిస్తాన్ లకి ఉగ్రవాదుల ముప్పు పొంచిఉందని అమెరికా నిఘా సంస్థల అధికారి వెల్లడించారు. పాకిస్తాన్ కి మద్దతుగా ఉన్న ఉగ్రవాద బృందాలు దాడులు చేసేందుకు సిధంగా ఉన్నారని జాతీయ విచారణ సంస్థ డైరెక్టర్ డాన్ కోట్స్ వెల్లడించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న పోరాటానికి కూడా పాకిస్తాన్ సరైన సహకారాన్ని అందించడం లేదని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులు తమ రక్షణ కోసం, పాకిస్తాన్ మద్దతుతో పొరుగు దేశాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. సెనేట్ సెలక్ట్ కమిటీతో సమావేశమైన కోట్స్, సిఐఎ డైరెక్టర్ జెనా హాస్పెల్, ఎఫ్బిఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వారే, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ డైరెక్టర్ రాబర్ట్ ఆష్లే తదితరులతో అంతకుముందు సమావేశమయ్యారు.
అమెరికా పై జరిగే దాడులను తాము ఎదుర్కుంటామని తెలిపారు. జులై మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు , తాలిబాన్ పెద్ద ఎత్తున చేపట్టనున్న దాడులు, ఉగ్రవాద బృందాలతో వ్యవహరించడంలో పాకిస్తాన్ తిరుగుబాటు, భారత్లో జరగనున్న ఎన్నికలు, మతపరమైన హింస వీటన్నింటి వల్ల దక్షిణాసియా దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు 2019లో మరింత పెరగనున్నాయని అన్నారు.