బీర్బమ్, జనవరి 30: వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, మమతా బెనర్జీ వేసిన పెయింటింగ్లను కొందరు చిట్ఫండ్ సంస్థల యజమానులు కోట్ల రూపాయలకు కొనుక్కున్నారంటూ భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ టీఎంసీ అధ్యక్షురాలు, దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలంటూ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
బీర్భూమ్లో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ.. ‘మోదీ బాబు మీకు దమ్ముంటే పెయింటింగ్స్ ద్వారా నేను డబ్బు సంపాదించానని రుజువు చేయండి. మీ పార్టీ నేతలకు కనీస మర్యాదు కూడా లేదు. అందుకే అలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు. దీనిపై తాము పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు.
తూర్పు మిడ్నాపూర్లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ అనంతరం తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి, ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో ఆర్ఏఎఫ్ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.