నిజామాబాదు, జనవరి 30: భారత ప్రధాని మోడీపై తెరాస ఎంపీ, సీఎం కెసిఆర్ కుమార్తె కవిత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మోదీ గ్రాఫ్ నానాటికీ పడిపోతోందని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నిలలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషించబోతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా కూడా ఇప్పటికీ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను ఆమోదించలేదని విమర్శించారు. ఎంపీ నిధులను ఏడాదికి కనీసం రూ. 25 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి వచ్చేలా టీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందని కవిత అన్నారు. నిజామాబాద్ లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో నిజామాబాదులో మంచి నీరు, డ్రైనేజీ సమస్యలు ఉండవని తెలిపారు. తెలంగాణకు కేటాయించే నిధుల విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రానున్న రోజుల్లో వైసీపీ సహా ఇతర పార్టీలను కలుస్తామని చెప్పారు.