ఢిల్లీ, ఆగస్టు1 : రాజన్నసిరిసిల్ల నేరెళ్లలో జరిగిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల నేరెళ్ల లో ఇసుక లారీ ఢీకొని భూమయ్య మరణించడంతో ప్రజలు ఆగ్రహంతో లారీలు దహనం చేశారు. దీంతో దళితులపై పోలీసులు దాడి జరిపిన ఘటన వ్యవహారంలో కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తం చేసింది. ఇప్పటికే జిల్లాలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ ఘటనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కారాగారంలో ఉన్న బాధితులను మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా ఇతరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు రక్షణ ఉండాల్సిన పోలీసులే దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇసుక లారీలు సామాన్యులను చంపేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మీరాకుమార్, ప్రశ్నించిన వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది బాధితులలో దయనీయంగా ఉన్న ముగ్గురి పరిస్థితి చూసి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వారికి 50 వేల చొప్పున, మిగతా ఇదుగురికి 25 వేల చొప్పున పరిహారం అందించారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తనున్నట్లు మీరాకుమార్ తెలిపారు. పీసిసి పిలుపు మేరకు ఛలో సిరిసిల్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రజా విద్యార్ధి సంఘాలు తప్పు పట్టాయి.