విజయవాడ, జనవరి 29: ఈరోజు విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను చాలా అన్యాయంగా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజనచేసారని .. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం మాత్రం వాస్తవమని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇవ్వాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ కోసం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న కృషి గొప్పదని అన్నారు.
కాగా, ఎప్పుడో జరిగిపోయిన రాష్ట్ర విభజన గురించి ఉండవల్లి ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని... భవిష్యత్తు తరాల కోసం పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండటం సరికాదని... మనం మౌనంగా ఉంటే ఏపీ ప్రజలకు పౌరుషం లేదని అనుకుంటారని చెప్పారు.