మళ్ళీ ధోని మిస్....

SMTV Desk 2019-01-29 15:23:42  Mahendra singh dhoni, ODI, India VS Newzeland, 3rd ODI, Dhoni Injured

న్యూ ఢిల్లీ, జనవరి 29: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా మూడో వన్డే మ్యాచ్ కు దూరం అవుతున్నాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో గాయం కారణంగా మ్యాచ్ కి దూరం అవడం ఇది ఆరోసారి. న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మూడో వన్డేలో ధోని స్థానంలో హార్డిక్ పాండ్యా ఆడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మరోసారి ధోనీని పక్కన బెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయేమోనని కంగారు పడ్డారు. అయితే గాయం కారణంగా ధోనీని ఈ మ్యాచ్‌లో ఆడించలేదని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.





ఇదివరకు 2013లో చివరి సారిగా ఇలా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యి మూడు వన్డేలు ఆడలేకపోయాడు. అంతకు ముందు 2007లో వైరల్ ఫీవర్ కారణంగా ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచ్‌లకు మహేంద్రుడు పాలుపంచుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తన ఆట తీరుపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన ధోనీ... ఆ సిరీస్‌లో అద్బుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అందుకున్నాడు. తాజా న్యూజిలాండ్ సిరీస్‌లో బ్యాట్‌తో పాటు వికెట్ కీపింగ్‌తోనూ జట్టును గెలిపిస్తున్నాడు.