బెంగళూరు, జూన్ 1: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్ళి పరిధిలో కొందరు బ్యాంకు దోపిడికి విఫలయత్నం చేశారు. తదుపరి రుణమాఫి చేసేంత వరకు తమ దోపిడి ప్రయత్నాలు సాగుతునే ఉంటాయని కరపత్రాన్ని ఘటనా స్థలంలో వదిలి వెళ్ళారు. ఘటన ఆ రాష్ట్రం లో కలకలం సృష్టించింది. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం లో కరపత్రాన్ని వదిలి తప్పు దారి పట్టించే యత్నం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే హుబ్బళ్ళి పరిధిలోని వలగుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మంగళవారం రాత్రి దొంగలు వీరంగం సృష్టించారు. బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టి లాకర్లను ధ్వంసం చేసి చోరీకి విఫల య త్నం చేశారు. దోపిడి కి ముందే బ్యాంకులోని సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. రుణ మాఫి చేసేంత వరకూ ...బ్యాంకు దోపిడిలు కొనసాగిస్తామని ఓ కరపత్రాన్ని ఘటనా స్థలంలో వదిలి వెళ్ళి కలకలం సృష్టించారు. దీన్నిబట్టి దోపిడీకి పాల్పడిన వారు దొంగలా..లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైతుల పేరిట కరపత్రం వదిలి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి ఉండేందుకు అవకాశం లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ ప్రారంభించిన పోలీసులు లాకర్ల దాకా అన్నీ పగులగొట్టిన వారు దొంగలై ఉంటారని..రైతులైతే అంతటి దారుణానికి ఒడిగట్టరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్యాంక్ లో డబ్బు, నగదు దోపిడీకి గురికాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.