హైదరాబాద్, జనవరి 29: అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం వొక్కసారిగా చల్లబడింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి అయిదు డిగ్రీ ల సెల్సియస్ వరకు పడి పోయింది. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. అల్పపీడన ద్రోణి మంగళవారం బలహీనపడుతుందని, బుధవారం అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఆదివారం రోజంతా ముసురుతో చిన్నపాటి జల్లులు పడగా, సోమవారం చల్లటి గాలులు వీచాయి. సోమవారం ఉదయం 11 గంటలవరకు మంచుతెరలు వీడకపోవడంతో రోడ్లపై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.