బీసీలు జడ్జీలుగా పనికిరారు : చంద్రబాబు..

SMTV Desk 2019-01-28 13:30:30  chndrababu, jayaho bc, rajamandri, TDP, YCP, dharmana prasadarao

విజయవాడ, జనవరి 28: తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో నిర్వహించిన ‘జయహో బీసీ సభను ఉద్దేశించి మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జయహో బీసీ అనే నైతిక అర్హత లేదని, అధికారంలో ఉండగా బీసీలకు కొద్దిగైనా ఉపకారం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు. రాజమండ్రి బీసీ సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సోమవారం విజయవాడలో నిర్వహింహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ విధంగా ధ్వజమెత్తారు. గడిచిన నాలుగున్నరేళ్ల పాలనా కాలంలో బీసీలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు బాబు ఏ వర్గాల వారికి మంత్రి పదవులు కట్టబెట్టారో అందరికీ తెలుసన్నారు. అంతెంతుందుకు... ఇన్నాళ్ల మీ రాజకీయ జీవితంలో వొక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు.

జస్టిస్‌ ఈశ్వరయ్య బీసీలకు జరిగిన అన్యాయంపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని నిలదీశారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల వేళ గెలిస్తే ఎస్టీల్లో చేరుస్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చి, గెలిచాక హామీ నిబెట్టుకోవాలని మత్స్యకారులు నిరసన తెలియజేస్తే అంతుచూస్తానని వారిని బెదిరించిన విషయాన్నిబాబు మర్చిపోయినా, ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇప్పటివరకు బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చిన చంద్రబాబును బీసీలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఎన్నిక వేళ బీసీలు ప్రశ్నిస్తారనే ఇటువంటి సభలు పెడుతున్నారని, నిజంగా బీసీలకు న్యాయం చేసి ఉన్నట్టయితే ఇటువంటి సమావేశాలు అవసరం లేదని అన్నారు.