విజయవాడ, జూలై 31: పవన్ కళ్యాణ్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, "జనసేన పార్టీ స్థాపించిన తరువాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ ఇది అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య మీడియా ద్వారా నా వరకు, పార్టీ వరకు తీసుకురావడం వలన నా వంతుగా పరిష్కారం దిశగా ప్రపంచానికి తెలిజెప్పాను, అలానే ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఇది రాజకీయ లబ్దికోసం కాదు, మానవత్వంతో చేశాను. ఈ సమస్యను రాజకీయం చేయడం సరికాదు. దీనిపై సీఎంగారు సానుకూలంగా స్పందించారు. ఉద్దానంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సుముఖతచూపించారు, భాదితులకు ఉపశమనం కలిగే చర్యలు తీసుకుంటున్నారు. ఇది మొదటి మెట్టు మాత్రమే అంతిమ లక్ష్యం అక్కడ నుంచి రూపు మాపడమే" అని ప్రకటించారు. రెండు నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తవుతాయి, అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. గరగపర్రు అంశం చాలా సున్నితమైన విషయం అని దళితులతో కలిసి పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు, ఆయన్ని ఓ కులానికి పరిమితం చేయడం సరికాదు స్థానిక అధికారుల వైఫల్యమే ఆ ఘటనకు కారంణమని ఆయన అన్నారు. రిజర్వేషన్లపై రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయవద్దు. సామాజిక బహిష్కరణను నేను తీవ్రంగా ఖండిస్త్తాను. నాకు రహస్య అజెండాలు లేవు. ప్రభుత్వం తప్పుచేస్తే వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏపీలో ఎవరి బలాలు వారికి ఉన్నాయి. నా బలం ఇప్పుడు చెప్పలేను జనంలోకి వెళ్లిన తర్వాత తెలుస్తుంది. ప్రత్యేకహోదపై పోరాటం ఆపలేదు, దానిని ముందుకు ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నాను అని ఆయన వెల్లడించారు.