అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా పలు ప్రజా సమస్యలపై అధికారులకి సూచనలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి సమావేశాల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే అన్న క్యాంటీన్ల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రకృతి సేద్యంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ‘ప్రత్యేకహోదా సాధన సమితి ఫిబ్రవరి 1న చేపట్టనున్న ఏపీ బంద్ కు చంద్రబాబు పరోక్షంగా మద్దతు తెలిపారు. బంద్ కు మద్దతుగా ఆరోజు నిర్వహించాల్సిన జన్మభూమి సమావేశాలను ఫిబ్రవరి 2 కి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.