అమరావతి, జనవరి 28: ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోటా రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
ద్వారకనాథ్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో సీనియర్ల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి అమర్ నాథ్ రెడ్డి, టీడీపీ ముఖ్యనేతలతో రాయబారం నడిపారు. టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్వయానా బావమరిది ద్వారకనాథ్ రెడ్డి.
ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి అప్రమత్తమైన వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఆయనతో మాట్లాడిన ఫలితం లేకపోయింది. ఈ రోజు ఉదయమే ద్వారకనాథ్ రెడ్డి అమరావతి చేరుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో ఆయన చేరనున్నారు.