పాట్నా, జూలై 31: ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మహా ఘటబంధన్ నుంచి విడిపోయి ఆర్జేడి, కాంగ్రెస్లకు షాకిచ్చి బీజేపీతో కలిసి తన పదవిని కాపాడుకున్న నితీశ్ కుమార్ తాజాగా ఇప్పుడు ఈ పార్టీ కూడా ఖంగుతినే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తరఫున నిలబడ్డ గోపాలకృష్ణ గాంధీకే తమ పార్టీ సభ్యులు ఓట్లు వేస్తారని, ఎన్డీయే తరఫున నిలబడిన వెంకయ్యనాయుడికి తమ పార్టీ మద్దతివ్వబోమని జేడీ(యూ) తేల్చి చెప్పింది. కూటమి నుంచి బయటకు రావడానికి ముందే గాంధీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని, దానిలో ఏలాంటి మార్పు వద్దని నితీశ్ నిర్ణయించారని, పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి సోమవారం మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని బీజేపీకి తెలపనున్నామని ఆయన స్పష్టం చేశారు.