విశాఖపట్నం, జనవరి 26: విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో తన పోటీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ పోటీ చెయ్యాలనేది ఎన్నికల కమిటీ నిర్ణయిస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఎక్కడ నుంచి పోటీచెయ్యాలనే నిర్ణయం తన చేతుల్లో లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తాను రాజకీయాల్లోకి మహర్షిలా తపస్సు చెయ్యడానికి రాలేదన్నారు. తన పోటీపై ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని అయితే పోటీ ఎక్కడ నుంచి అనేది ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో పలువురు జనసైనికులు గాజువాక నుంచి పోటీ చెయ్యాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. భగవంతుడి ఆదేశిస్తే అక్కడ నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలు సంయమనం పాటించాలని పవన్ కోరారు. తాను ఎంపీ కావాలనో, ఎమ్మెల్యే కావాలనో రాజకీయాల్లోకి రాలేదని, ఓ బలమైన వ్యూహంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను వ్యూహం రచించింది ముందుకు సాగటానికే తప్ప వెనకడుగు వెయ్యడానికి కాదన్నారు. కాబట్టి జనసేన కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జనసేనకు ఓటెయ్యాలని బలంగా చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం కల్పించాలని పవన్ కోరారు.