హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు తీరని అవమానం జరిగింది. అదెక్కడా అని అనుకుంటున్నారా !! వందేళ్లకు పైగా చరిత్ర కలిగి, ఎంతో ఘనత కలిగిన ఉస్మానియా యూనివర్శిటీలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ట్స్ కళాశాల భవనంపై యూనివర్శిటీ అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే, ఆ జాతీయ జెండా చిరిగిపోయి ఉండటం కలకలం రేపింది. చిరిగిపోయిన జెండాను గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. జెండా ఎలా ఉందో కూడా చూసుకోకుండా, నిర్లక్ష్యంగా ఎగురవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టారు. మరో జెండాను తెప్పించి, ఎగురవేశారు. మరోవైపు, రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు కూడా సరిగా లేవంటూ విమర్శలు వెల్లువెత్తాయి.