హైదరాబాద్, జనవరి 25: రేపు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీకి సంబంధించిన ‘వొకడొచ్చాడు.. అనే సాంగ్ ను హీరో రామ్చరణ్ విడుదల చేశారు. ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నా. లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్ అని చరణ్ పోస్ట్ చేశారు.
‘వొకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతిగొలుప.. అని సాగే ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. చరణ్ ఇప్పటికే అనేక సందర్భాల్లో తన బాబాయికి మద్దతు తెలిపారు. పవన్ అడిగితే ఏం చేయడానికైనా కుటుంబం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు.