విజయవాడ, జనవరి 23: ఈ నెల 25న మాజీ వైసీపీ నేత వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ రాధకు విజయవాడ సెంట్రల్ సీటును కట్టబెట్టాలని చూస్తోంది అని చర్చలు జరుగుతున్నాయి. అయితే రాధా టీడీపీలో ప్రవేశంపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పందించారు. రాధా రాకను తాము స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు.
ఆ పార్టీ నుంచి మరికొంత మంది నాయకులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సూట్ కేసు కంపెనీల కోసం పార్టీ పెట్టిన జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని అనేక హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారన్నారు, నియోజకవర్గంలో 85 శాతం మంది ప్రజలు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేస్తున్న అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.