టీడీపీని వీడిన మరో కీలక నేత....

SMTV Desk 2019-01-23 13:19:37  TDP, AP Minister, Somireddy, Ramakota reddy, YSRCP, YS Jagan mohan reddy

నెల్లూర్, జనవరి 23: తెదేపా పార్టీ కీలక నేత, మంత్రి సోమి రెడ్డి బావ రామకోటా రెడ్డి తేదేపాకు షాక్ ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా రామకోటా రెడ్డి పార్టీ మారుతున్న విషయంపై అనేక వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్ని కాస్త నిజం చేశాడు రామకోటా రెడ్డి. తాజాగా ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం రామకోటారెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి చర్చలు జరిపారు. వారింట్లోనే అందరూ కలిసి భోజనం చేశారు.





ఓ ఇంటికి సంబంధించిన గొడవ కారణంగా బావబావమరుదుల మధ్య గొడవ జరిగిందని జిల్లాలో చర్చ నడుస్తోంది. నెల్లూరు రూరల్ మండలం మద్దూరుపాడులో రోడ్డుకు వొక ఇళ్లు అడ్డుగా ఉందనే విషయంలో గొడవ నడిచింది. దీనిపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షలు కూడా చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతలైన బీద సోదరులు తమకు వ్యతిరేకంగా స్పందించారంటూ రామకోటారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు రామకోటారెడ్డి ఇంటికి వెళ్లడం, అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వీరి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరినట్లు పచ్చకండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.