అమరావతి, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కలిపిస్తూ చేసిన చట్టంపై ఆయన మాట్లాడుతూ.. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తాము ఎప్పుడో కోరామని, కానీ బీజేపీ నేతలు అప్పుడు వొప్పుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ‘ఎలక్షన్ మిషన్ 2019 పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం కోటాలో 5 శాతం కాపులకు, మరో ఐదు శాతం రిజర్వేషన్ ను ఈడబ్ల్యూఎస్ పేదలకు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మమత బెనర్జీ చేపట్టిన కోల్ కతా సభతో బీజేపీ బెంబేలెత్తిందని, కూటమిలో నలుగురు ప్రధానులు ఉన్నారని మోదీ చెప్పడం ఆయన భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు ఇస్తున్నామని గడ్కరీ అబద్ధం చెప్పారనీ, కేవలం టోల్ రహదారులు మంజూరు చేసి ఏదో ఉద్ధరించినట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జనవరి 25న ఏపీలో పలు చోట్ల పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించి మహిళా సదస్సులు చేపడతామని బాబు తెలిపారు. ఈవీఎంల హ్యాకింగ్ విషయంపై దేశంలోని 22 విపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.