బెంగుళూర్, జనవరి 21: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దేశాన్ని సమర్థవంతంగా నడిపించగల సామర్థ్యం ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా భాజపా ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారన్నారు. మమతా ఓ మంచి నాయకురాలని కొనియాడారు.
ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ.. ‘దేశంలోని ప్రజలంతా మోదీ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలు రాష్ట్రాలు తమ సొంత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. అందువల్ల ఎన్నికల ముందు లీడర్ను ఎంచుకునేందుకు ఇది సరైన సమయం కాదు. సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. వాళ్లు దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. మునుపటి ప్రభుత్వాలు విఫలమైన చోట వారు రాణించగలరు. కానీ మేము ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నేత ఎవరనేది నిర్ణయిస్తాం అని ఆయన తెలిపారు. మమత బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీపై ఆయన స్పందించారు. మమత బలమైన నాయకురాలని... ర్యాలీని చాలా చక్కగా నిర్వహించారంటూ మమతపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నికల తర్వాత అందరూ ఏకతాటిపైకి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.