డ్వాక్రా మహిళలకు శుభవార్త..!

SMTV Desk 2019-01-21 18:35:39  AP CM, Chandrababu, dwakra group womens, schemes

అనంతపురం, జనవరి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పానున్నారు. డ్వాక్రా గ్రూప్ లో ఉన్న వొక్కో మహిళకు రూ.10 వేలతోపాటు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈనెల 26న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ఈవిషయానికి సంబంధించిన విధివిధానాలు వెల్లడించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 63 మండల సమాఖ్యలు, 2,858 గ్రామైక్య సంఘాలు, 56,036 స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 5.82 లక్షల మంది డ్వాక్రామహిళలు సభ్యులుగా ఉన్నారు.

తాజా నిర్ణయం మేరకు అన్ని సంఘాల సభ్యులకు మరోసారి రూ.10వేలతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ లెక్కన జిల్లాలోని సభ్యులందరికీ రూ.582 కోట్లు జమ చేయనున్నారు. అయితే వొకేసారి ఆ మొత్తం ఇస్తారా లేదా విడతలవారీగా ఇస్తారా అనేది తెలియాల్సిఉంది. స్మార్ట్‌‌ఫోన్‌ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు రీచార్జి కూడా చేయించాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.