భోపాల్ నుంచి బరిలో దిగనున్న కరీనా..

SMTV Desk 2019-01-21 16:38:22  Kareena Kapoor, Bhopal, Bhopal MP seat, Congress party, Lok Sabha Election 2019

ముంబై, జనవరి 21: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలలో విజయం పొందిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. మధ్యప్రదేశ్‌లోనూ అధికారాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. ఈ మేరకు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌ టికెట్‌ను బాలీవుడ్‌ హీరోయిన్ కరీనా కపూర్‌కు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. కాగా,ఈ విషయం గురించి కాంగ్రెస్‌ నాయకులు ఆనీస్‌ ఖాన్‌, గుడ్డు చౌహాన్‌ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. భోపాల్‌లో బీజేపీని ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.. దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పాటు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని గుడ్డు చౌహన్‌ విశ్వసిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ తాత వొకప్పుడు భోపాల్‌ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్‌ తరఫున భోపాల్‌ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని గుడ్డు చౌహాన్‌ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా బీజేపీ నాయకులు అప్పుడే దీనిపై విమర్శించడం ప్రారంభించారు. బీజేపీని ఎదుర్కోగల బలమైన అభ్యర్థి కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. అందుకే సినితారలను నిలబెట్టాలని భావిస్తోంది. స్థానిక నాయకులు ఎవరూ ఆ పార్టీకి కనిపించడం లేదంటూ బీజేపీ విమర్శిస్తోంది.