ఏపీలో బీసీలకు నాయకత్వం వహిస్తా..!

SMTV Desk 2019-01-21 14:17:48  Andhrapradesh, Talasani srinivas yadav, BC, KCR, Chandrababu

హైదరాబాద్, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి బిసిలకు నాయకత్వం వహిస్తానని, వారిని ఏకం చేస్తానని, ఆ ప్రాంతం నుంచి తనను చాలామంది ఆహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు. ఏపిలో బిసిలను ఏకం చేసేందుకు తన వద్ద మంచి ఆయుధాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ లాబీల మీడియా ప్రతినిధులతో తలసాని ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపిలో వొక్కశాతం ఓట్లనైనా ప్రభావితం చేస్తానని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. అలపాటి రాజేంద్రప్రసాద్‌ నియోజకవర్గంలో 25 వేల యాదవుల ఓట్లు ఉన్నాయని, ఆయన్ను ఓడించడానికి ఆ ఓట్లు చాలని తలసాని పేర్కొన్నారు. బాలకృష్ణ, ఆలపాటి వచ్చి తన నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు.

తాను వొక్కడిని ఏపికి వెళితేనే టిడిపి నేతలు వణికిపోతున్నారని, కేసిఆర్‌ వెళితే ఇంకెంత భయపడతారోననని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిసిలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దేనన్నారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు బిసిలకు న్యాయం జరిగిందని, చంద్రబాబు బిసిలకు చేసిందేమీ లేదన్నారు. జగన్‌, కేసిఆర్‌ కలవటం వల్ల వైఎస్సారీ కాంగ్రెస్‌కు నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చినట్టు భారీ మెజారిటీలు ఏపిలో రావని, వందల ఓట్ల తేడాతో నేతల జాతకాలు మారిపోతాయని శ్రీనివాస్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు.