హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశమంతా తిరిగారని, కానీ చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారనేది స్పష్టమవుతోందని ఆమె అన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కలిసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లాంటి వాళ్లు కోల్కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో పాల్గొని బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కు మద్దతిచ్చారని విజయశాంతి తెలిపారు.
టీఆర్ఎస్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందేమోనని ఆమె అన్నారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే కూటమిని ఫెడరల్ ఫ్రంట్ అనడం కంటే "ఫెడప్ ఫ్రంట్" అనాలని విజయశాంతి వ్యాఖ్యానించారు.