విజయవాడ, జనవరి 21: వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపారు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు రాధా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు వంగవీటి రాధా హాజరు కాకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా.. విజయవాడ సెంట్రల్ సీటును రాధా ఆశించారు. సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైనట్లు సమాచారం. అయితే విజయవాడ ఈస్ట్, లేక మచిలీపట్నం నుంచి సీటు కేటాయిస్తామని పార్టీ నిర్ణయం తీసున్నట్లు సమాచారం. దీంతో సెంట్రల్ సీటు ఆశించి భంగపడ్డందుకే రాధా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదు నాది. పోరాటమే నా ఊపిరి అంటూ తన రాజీనామా లేఖలో తన తండ్రి వంగవీటి మోహనరంగా చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.