అమరావతి, జూలై 30: ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు పొంగి, రాజధాని ప్రాంతంలోని దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. శనివారం రాత్రి వరకూ తుళ్లూరుతో పాటు మంగళగిరి ప్రాంతాల్లోని గ్రామాల్లోకి నీరు చేరింది, రాజధాని కోసం భూసమీకరణ చేసిన పొలాలను కూడా నీరు ముంచెత్తింది. భూ సమీకరణ తరువాత మొదటిసారిగా ఈ వాగు పొంగింది. ఇక తాజా వర్షాలకు రాజధాని ప్రాంతంలో నిర్మించిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వరకూ వరద నీరు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వాగు నిండుగా నీరుండటం, పత్తి పంటలు మునగడంతో, ఏ మాత్రం వర్షాలు కురిసినా మరిన్ని గ్రామాలవైపు నీరు వస్తుందని, తాత్కాలిక సచివాలయానికీ ముప్పు తప్పదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. కాగా, పెదపరిమి సమీపంలోని 30 ఎకరాల పత్తి, 20 ఎకరాల అపరాల పంట నీట మునిగిందని, గ్రామంలోని రెండు కాలనీల్లోకి వరద నీరు వచ్చిందని తెలుస్తోంది.