చీకటి ఒప్పందాల అలవాటు చంద్రబాబుకే ఉంది : రోజా

SMTV Desk 2019-01-17 19:07:52  YCP MLA Roja, Chandrababu, TDP, KTR, TRS

అమరావతి, జనవరి 17: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా స్పందిస్తూ ఓ మీడియాతో మాట్లాడారు. చీకటి వొప్పందాలు చేసుకునే అలవాటు చంద్రబాబుకే ఉందని కేటీఆర్ ని జగన్ కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ-టీఆర్ఎస్ ల కలయికపై ఇప్పటికే టీడీపీ నేతలు పలు విమర్శలు చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ, పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత తెలుగుదేశం పార్టీ నాయకులకు కరెక్టుగా సరిపోతుందని అన్నారు. ఎందుకంటే, చీకటి వొప్పందాలు, ఎవరితోబడితే వారితో పొత్తులు పెట్టుకునే అలవాటు చంద్రబాబునాయుడుకి, ఆయన పార్టీకి ఉందన్న విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసని విమర్శించారు.

చంద్రబాబు ఈరోజున పొత్తుపెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీయేనని, వొకప్పుడు బీజేపీతో, మొన్న కాంగ్రెస్ పార్టీతో, 2009లో కేసీఆర్ తో చంద్రబాబు ఎలా పొత్తులు పెట్టుకున్నారో అందరూ చూశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వొంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పినప్పటికీ, బీజేపీతో వైసీపీ కలిసిపోయిందని బురద జల్లడం లేదా కేసీఆర్ తో కలిసిపోయామనో బురద జల్లడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు, ఓటమి భయం ఎంతగా పట్టుకుందనడానికి నిదర్శనమని అన్నారు.