హైదరాబాద్, జనవరి 16: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో "మా నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు, నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారిని కలవనున్నాను. మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లనున్నాను. ఎన్టీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడుతున్న ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేయడంపై చర్చించనున్నాను" అని ట్వీట్ చేసారు. కాగా, నేడు కేటీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు జగన్ ఇంటికి వెళ్లనుండగా, వారికి మధ్యాహ్న భోజన విందును జగన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.