సిడ్నీ, జనవరి 12: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున ఝార్ఖండ్ డైనమైట్ ధోని వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన తొలి వన్డేలో రిచర్డ్సన్ బౌలింగ్లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు.కెరీర్లో 334వ వన్డే ఆడుతున్న ధోని భారత్ తరఫున 10వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,235) 10వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.