రాజమండ్రి, జనవరి 10: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడి జనసేనలోకి వెళ్తున్నారు అని గతకొంతకాలంగా పార్టీ వర్గంలో అనేక వార్తలొచ్చాయి. ఈ వార్తలను ఇదివరకు కొట్టిపడేసిన సత్యనారాయణ తాజాగా తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, పార్టీ అధినేత అమిత్ షాను కలిసి స్వయంగా రాజీనామా లేఖను అందిస్తానని, ఈ నెల 21న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి 21న జనసేనలో చేరుతానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు మూడు హామీలను ఇచ్చిన బీజేపీ వొక్కటి కూడా నెరవేర్చలేదని ఆకుల ఎద్దేవా చేశారు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం వల్ల సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ బీజేపీ ప్రజాదరణ పొందలేకపోయిందని సత్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు జనసేన వొక పొలిటికల్ పార్టీకాదని.. అదొక ప్రజా ఉద్యమమని జనసేన నేత రావెల కిశోర్ బాబు అన్నారు. ఉద్యమాల్లోంచే రాజకీయ పార్టీలు ఉద్భవించాయని, ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు పరిణామక్రమంలో రాజకీయ పార్టీలుగా మారాయని ఆయన అన్నారు.