న్యూఢిల్లీ, జనవరి 10: దేశంలోని అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో సులువుగా ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షలను ఎదుర్కొంది. లోక్సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ ఎగువ సభలో ప్రవేశపెట్టగా ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 149 ఓట్లు రాగ, బిల్లుకు వ్యతిరేకంగా 7 ఓట్లు పడ్డాయి.
ఈ ఓటింగ్ సమయంలో సభలో 156 మంది సభ్యులు ఉండగా, దాదాపు అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలుపగా, నిన్న రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది.