హైదరాబాద్, జనవరి 9: ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియంలో మంగళవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొని ‘2019 డైరీ ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన సమయంలోనే టీఎన్జీవో పేరు పెట్టారని, లగడపాటి లాంటి వారిని అడ్డుకున్నారు కాబట్టే తెలంగాణ కల సాకారమైనది హరీశ్ గుర్తుచేశారు. చంద్రబాబు వల్లే ఉద్యోగుల విభజనలో సమస్యలు తలెత్తాయని, ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, హైకోర్టు విభజనను ఏపీ సీఎం అడ్డుకున్నారని హరీశ్ రావు అన్నారు.
ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో పడుకునేందుకు సిద్ధపడ్డారన్నారు. సకలజనుల సమ్మెను విజయవంతం చేశారని, నాటి ఉద్యమ సంఘం నేత స్వామిగౌడ్పై హత్యాయత్నం జరిగినప్పుడు రక్షణ కవచంలా నిలిచారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 17 ఎంపీ స్థానాలను గెలవాలని, పార్లమెంటులో బలంగా ఉంటేనే రాష్ట్ర సమస్యలు పరిస్కారమవుతాయన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, ఆయన అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.