నల్గొండ, జనవరి 9: జిల్లా చందంపేట గ్రామానికి చెందిన ఓ దంపతులకు పదో కాన్పులో ఆడ బిడ్డ పుట్టిందని భాదతో ఆ పసికందును అమ్మేసేందుకు సిద్దమయ్యారు ఆ దంపతులు. పూర్తి వివరాల ప్రకారం చందంపేట గ్రామంలో ఇస్లావత్ సావిత్రి దంపతులకు ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉండగా మరో అబ్బాయి కోసం గర్భం దాల్చిన ఆ తల్లి పదో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అమ్మాయి పుట్టడంతో ఆ దంపతులు నిరాశకు గురయ్యారు. ఆకలితో ఆ పసికందు ఎంత ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. పాలిచ్చేందుకు మొహం తిప్పేసింది.
ఎంతసేపటికి ఆ బిడ్డ ఏడుపు ఆపక పోయేసరికి చలించిపోయిన చుట్టుపక్కలవారు వారిని మందలించారు. పాలుపట్టాలని చెప్పినా తల్లి ముందుకు రాలేదు. చివరికి వారే పెద్ద మనసుతో పోతపాలు పట్టి బిడ్డ ఆకలి తీర్చారు. మరోవైపు బిడ్డను విక్రయించేందుకు చిన్నారి తల్లిదండ్రులు ప్రయత్నించడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరింది. చిన్నారి కనిపించకపోయినా, ఆమెకేమన్నా జరిగినా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారుల మాట వినకపోగా.. వాగ్వాదానికి దిగడంతో పోలీసుల ద్వారా చిన్నారిని ఇంటికి తీసుకెళ్లడానికి అంగీకరించారు.